సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విద్వేష వ్యాపారి అని, ఆయన ప్రజలను విభజించే రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత, ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. గోవు పేరుతో జరుగుతున్న దాడులపై రాహుల్ మోదీ సర్కార్పై విరుచుకుపడిన తీరుపై గోయల్ స్పందించారు. ఎక్కడ నేరం జరిగినా రాజకీయ ప్రయోజనాల కోసం జోక్యం చేసుకోవడాన్ని ఆపాలని రాహుల్కు సూచించారు. రాజకీయ లబ్ధికోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.
కాగా, ఆవును తరలిస్తున్నారనే అనుమానంతో అల్లరి మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స అందించడంలో జాప్యం కారణంగా మరణించిన ఘటనపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై రాహుల్ మండిపడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సామూహిక దాడులను నిరోధించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇక తాజా ఘటనలో బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చేశారని అన్నారు.
అల్వార్ దాడిపై పార్లమెంట్ ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. దాడి జరిగిన ప్రాంతం నుంచి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఆస్పత్రి ఉన్నా బాధితుడిని తరలించేందుకు పోలీసులకు మూడు గంటల సమయం ఎందుకు పట్టిందో తెలపాలని రాహుల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రవచించే నవభాతర్లో విద్వేషం రాజ్యమేలుతోందని, ప్రజల మెడలు వంచి మరణించేలా చేస్తున్నారని ట్వీట్ చేశారు.